అల్లూరి సీతారామరాజు


జాతికోసం తమ ప్రాణాలనే త్యాగం చేసిన అమర వీరులను స్మరించుకుందాం .....
పేరు : అల్లూరి సీతారామరాజు
తండ్రి పేరు : శ్రీ వెంకట రామరాజు
తల్లి పేరు : శ్రీమతి సూర్యనారాయణమ్మ
పుట్టిన తేది : 4-7-1897.
పుట్టిన ప్రదేశం :పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు అనే గ్రామంలో జన్మించాడు.
చదివిన ప్రదేశం : రాజమండ్రి, నర్సాపురం, కాకినాడ.
చదువు : నాల్గవ ఫారం.
గొప్పదనం : బ్రిటీషు వారిని ఎదిరించి దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు.
స్వర్గస్తుడైన తేది : 7-5-1924.
నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం తాలూకా, నాడు కృష్ణాజిల్లా లోనిది. భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు అనే గ్రామం వుంది. ఆ గ్రామమే రామరాజు స్వగ్రామం. సీతారామరాజు ముత్తాత గోపాల కృష్ణం రాజు. తాత వెంకట కృష్ణం రాజు. సూర్యనారాయణమ్మ పూర్వీకులు అనకాపల్లి దగ్గర "పాండ్రంకి"లో స్థిరపడిపోయారు. 1902 లో వారి కుటుంబం రాజమహేంద్రవరంలో స్థిరపడిపోయింది. ఫోటోగ్రాఫర్ గా వెంకట రామరాజుగారికి మంచి పేరు వచ్చింది. ఆదాయం కూడా క్రమంగా పెరుగ సాగింది. ఫోటోలు తీసేవారు చాలా తక్కువమంది కావడం చేత ఆయనకు చేతినిండా పనివుండేది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఫోటోలను ఆయనే తీసేవారు. అప్పుడే తిలక్, లాలాలజపతిరాయ్ వంటి ప్రముఖుల ఫోటోలను తీయడం జరిగింది. 1905 లో వంగ రాష్ట్రవిభజన జరిగింది. స్వదేశీ ఉద్యమం ప్రారంభమయింది. వెంకట రామరాజుని కూడా ఈ ఉద్యమం ఆకర్షించినా ఆయన పాల్గొనలేదు. దేశభక్తి ఆయనను ఆవరించినా కుటుంబ పోషణభారం వల్ల ఆయన స్టూడియోలోనే ఉండేందుకు నిర్ణయించుకొన్నాడు. కానీ జాతీయ భావంతో కూడిన నినాదాలు ఇంటిలో చేస్తూనే, "వందేమాతరం" అని పాడుతూనే ఉండేవాడు. 1906లో రామరాజుకు, సోదరుడు సత్యనారాయణ రాజు జన్మించాడు. ఆయన ప్రభావం కుమారుడైన రామరాజు మీద పడింది. రామరాజు చిన్నతనం నుండే ఎంతో అందంగా వుండేవాడు. బంగారు రంగుతోనున్న అతని శరీరంలో ఆకర్షణీయమైన తేజస్సు వుండేది. చిన్ననాటినుండి రామరాజులో ఓ ప్రత్యేకత కనిపించేది. జీవరాసులపట్ల ప్రేమ, దయ చూపేవాడు. చిన్నప్పటి నుండే రామరాజులో స్వతంత్ర భావం, జాతీయ భావం ఉండేది. దానికి కారకుడు తండ్రే.. రామరాజుకు తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఒక రోజు సాయంత్రం రాజమహేంద్రవరంలో రామరాజు తండ్రితో కలిసి వీధిలోకి వెళ్ళే సమయంలో ఓ తెల్లదొర గుర్రం మీద ఎదురు రావడం జరిగింది. చుట్టు నున్న వారు నమస్కరించేందుకు చేతులెత్తడం చూచి రామరాజు కూడా యెత్తబోయాడు. కాని తండ్రి ఆ చేతులపై కొట్టి "తెల్లవాడికి నమస్కరింపరాదు" అని మందలించాడు. ఆ పసి హృదయంలో ఆ మాటలు నిలచిపోయాయి. మోగల్లులో వున్నప్పుడే రామరాజుకు అయిదవ సంత్సరంలోనే విద్యాభ్యాసం జరిగింది. చిన్న తరగతుల్లోనే ఎంతో తెలివిగా మెలిగేవాడు. అందుచేత ప్రాధమిక పాఠశాలలో మూడవ తరగతి నుండి అయిదులో వేశారు. రాజమహేంద్రవరంలో స్థిరపడిన తరువాత దేశ పరిస్థితులలో మరింత మార్పు కనిపించింది. స్వాతంత్ర సమరం మరింత వేగం పుంజుకుంది. 1907లో బెంగాలులో ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి.



Pages: 1 2 3 4 5 6

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

No comments: