దేవుని లీల



వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు.
"రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు నా బతుకు చూడు ఎంత కష్టమో? ఒక్కరోజు...ఒక్కటంటే ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి నీ పనిని నేను చేస్తా"  అని సవాలు విసిరాడు. దేవుడు వినీ వినీ సరేనన్నాడు.                           "అయితే ఒక్క షరతు నువ్వు ఎవరేమన్నా నువ్వుమాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు నోరు మెదప కూడదు" అన్నాడు దేవుడు.
"సరే" అన్నాడు మనోడు తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.
"దేవా నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది అతను చూడకుండా వెళ్లిపోయాడు.
మనోడు "ఒరేయ్.. పర్సు వదిలేశావు చూసుకోరా" అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.
"దేవా...నా దగ్గర ఒక్కరూపాయి మాత్రమే ఉంది. అది నీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ" అంటూ మోకరిల్లాడు. కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. "ఇలా దయ చూపించావా తండ్రీ" అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.
"ఒరేయ్ దొంగా" అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించు కున్నాడు. ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.
"దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది నన్ను చల్లగా కాపాడు స్వామీ" అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. "నా తరువాత వచ్చింది ఇతడే కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు పట్టుకొండి" అన్నాడు.
పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.
"ఆగండ్రా...ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు వాడు పర్సును తీసుకెళ్లాడు" అని అరిచేశాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఉడ్చే వాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు వీధులు ఉడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.
"దేవా... ఇవాళ్ల ఎంత మంచిపని చేశానో తెలుసా...నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను. ఒక దోషిని అరెస్టు చేయించాను" అన్నాడు మనోడు.
దేవుడు "ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నానా...ఎందుకలా చేశావు" అన్నాడు నిష్ఠూరంగా.
"అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను" అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా.
"ధనవంతుడు మహాపాపాత్ముడు వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడికి కష్టాలు తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెనుతుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు. ఇప్పుడు చూడు...పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు” అన్నాడు దేవుడు.
దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు.  కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం?



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

వెంట వచ్చేది

వెంట వచ్చేది ?!

పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది. 'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు.

లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.

అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది'
ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.

ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు.

ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు.

ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.

గుమాస్తా చదవడం ప్రారంభించాడు.
1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా.
3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?
అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు.

సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు.

ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.
1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.

దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో  అతడు గుర్తించాడు. ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.


నీతి:- జీవుని వెంట వచ్చేది తాను చేసిన కర్మయే.
పుణ్యం వలన సుఖము,
పాపము వలన దుఃఖము,
జ్ఞానము వలన మోక్షము
కనుక జీవుడు పుణ్యకర్మల ద్వారా పాపకర్మలను నిర్మూలించి , చిత్తమును శుద్ధము చేసుకొని , ధ్యానాదిసాధన ద్వారా మోక్షరూప పరమశాంతిని, శాశ్వతఆనందమును పొందవలసియున్నది.



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

భజగోవింద శ్లోకాలు తాత్పర్యసహితముగా

*భజగోవిందం సాహిత్యం...*

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే 
నహి నహి రక్షతి డుకృణ్ కరణే ||1||


భావం: భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని... ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ (డుకృణ్ కరణే లాంటి ) వ్యాకరణ  సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు. 



మూఢ జహీహి ధనాగమతృష్ణాం

కురు సద్బుద్ధిం మనసివితృష్ణాం

యల్లభసే నిజకర్మోపాత్తం

విత్తం  తేన వినోదయ చిత్తం ||2||


భావం: ఓ మూర్ఖుడా! ధనసంపాదన ఆశ విడిచిపెట్టు. మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు. 



నారీస్తనభర నాభీదేశం

దృష్ట్వా  మాగామోహావేశం

ఏతన్మామ్సావసాది వికారం

మనసి విచింతయ వారం వారం ||3||


భావం: స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు.



నళినీ దళగత జలమతి తరళం

తద్వజ్జీవితమతిశయచపలం 

విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం

లోకం శోకహతం చ సమస్తం ||4||


భావం: తామరాకు మీద నీటిబొట్టు ఎంత చెంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు ఈ మానవ జీవితం అంతా రోగాలతోనూ 'నాది' అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో.



యావద్విత్తోపార్జన సక్తః

తావన్నిజ పరివారో రక్తః

పశ్చాజీవతి జర్జర దేహే

వార్తాం కోపి న పృచ్చతి గేహే ||5||


భావం: ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు.



యావత్పవనో నివసతి దేహే

తావత్పృచ్చతి కుశలం గేహే

గతవతి వాయౌ దేహాపాయే

భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||6||


భావం: ఎంతవరకైతే ఈ దేహం లో ప్రాణం ఉంటుందో  అంతవరకే ఇంట్లోనివారు క్షేమాన్ని అడుగుతారు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆకాయాన్ని  చూసి భార్య కూడా భయపడుతుంది.




బాలస్తావత్క్రీడాసక్త

తరుణస్తావత్తరుణీసక్తః |

వృద్ధస్తావాచ్చింతాసక్తః

పరే బ్రహ్మణి కో పి నసక్తః ||7||


భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల  పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!!




కా తే కాంతా కస్తే పుత్రః

సంసారో యమతీవ విచిత్రః |

కస్య త్వం కః కుత ఆయాతః

తత్వం చింతయ తదిహ భ్రాతః ||8||


భావం: నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే - ఈ దేహం లో ఉండగానే ఆలోచన చేయి.




సత్సంగత్వే నిస్సంగత్వం

నిస్సంగత్వే నిర్మోహత్వం |

నిర్మోహత్వే నిశ్చలతత్వం

నిశ్చలతత్వే జీవన్ముక్తి: ||9||


భావం: సత్పురుషులతో సాంగత్యం  చేయడం వల్ల  ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి.



వయసి గతే కః కామవికారః

శుష్కే నీరే కః కాసారః |

క్షీణే విత్తే కః పరివారః

జ్ఞాతే తత్వే కః సంసారః ||10||


భావం: వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు.  నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.



మా కురు ధన జన యవ్వన గర్వం 

హరతి నిమేషాత్కాలః సర్వం |

మాయామయమిదమఖిలం హిత్వా

బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా  ||11||


భావం: ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యౌవనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిముషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు.



దినయామిన్యౌ సాయం ప్రాతః

శిశిరవసంతవ్ పునరాయాతః |

కాలః క్రీడతి గచ్ఛత్యాయుః 

తదపి న ముంచత్యాశావాయుః  ||12||


భావం: రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి; పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు గాక వదలడు.




కాతే కాంతా ధనగతచింతా

వాతుల కిం తవ నాస్తి నియంతా |

త్రిజగతి సజ్జనసంగతిరేకా

భవతి భవార్ణవతరణే నౌకా  ||13||


భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక.



ద్వాదశమంజరికాభిరశేషః

కథితో వైయాకరణస్యైషః .

ఉపదేశో భూద్విద్యానిపుణైః

శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః  ॥13.అ॥


భావం: ఈ పన్నెండు (2-13) శ్లోకాలు శ్రీ శంకర భగవత్పాదులవారు ఒక వ్యాకరణకర్తకి ఉపదేశంగా ప్రసాదించారు.



జటిలో ముండీ లుంఛితకేశః

కాషాయాంబరబహుకృతవేషః |

పశ్యన్నపి చన పశ్యతి మూఢః

హ్యుదరనిమిత్తం బహుకృతవేషః ||14||


భావం: జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకివేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి  వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటికోసమే గాని, వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు.



అంగం గలితం పలితం ముండం

దశనవిహీనం జాతం తుండం |

వృద్ధో యాతి గృహీత్వా దండం

తదపి న ముంచత్యాశాపిండం ||15||


భావం: శరీరం కృశించిపోయింది, తల నెరసిపోయింది, నోటిలో పళ్ళు ఊడిపోయినవి. ముసలితనం పైబడి కఱ్ఱ చేతికొచ్చింది. ఐనా సరే ఆశల - కోరికల మూట మాత్రం వదిలిపెట్టడు.



అగ్రే వహ్నిః పృష్ఠేభానుః

రాత్రౌ చుబుకసమర్పితజానుః |

కరతలభిక్షస్తరుతలవాసః

తదపి న ముంచత్యాశాపాశ: ||16||


భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని,  వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.



కురుతే గంగాసాగారగమనం

వ్రత పరిపాలన మథవా దానం |

జ్ఞానవిహీనః సర్వమతేన

ముక్తిం న భజతి జన్మశతేన ||17||


భావం: తీర్థయాత్రలు చేయవచ్చు; పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చు; దానధర్మాలు చేయవచ్చు. కాని ఆత్మజ్ఞానము పొందనివాడు నూఱు జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడని సర్వమతముల విశ్వాసం.



సుర మందిర తరు మూల నివాసః

శయ్యా భూతలమజినం వాసః |

సర్వ పరిగ్రహ భోగ త్యాగః

కస్య సుఖం న కరోతి విరాగః ||18||


భావం: దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ నివసిస్తూ; కటిక నేల మీద నిద్రిస్తూ; చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ; దేనినీ గ్రహించకుండా - ఏమీ కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు? తప్పక లభిస్తుంది.



యోగరతో వా భోగరతో వా

సంగరతో వా సంగవిహీనః |

యస్య బ్రహ్మణి రమతే చిత్తం

నందతి నందతి నందత్యేవ ||19||


భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం.




భగవద్గీతా కించిదధీత

గంగా జలలవ కణికాపీతా |

సకృదపి యేన మురారి సమర్చా

క్రియతే తస్య యమేవ న చర్చ ||20||


భావం: ఎవరైతే భగవద్గీతని కొంచమైనా అధ్యయనం చేస్తారో, గంగా జలాన్ని కొద్దిగా ఐనా తాగుతారో, కొంచమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదం ఉండదు.



పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం |

ఇహ సంసార బహు దుస్తారే

కృపయా పారే పాహి మురారే ||21||


భావం: మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం; మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం - ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు.



రథ్యా చర్పట విరచిత కంథః

పుణ్యాపుణ్య వివర్జిత పంథః |

యోగి యోగనియోజిత చిత్తో

రమతే బాలోన్మత్తవదేవ ||22||


భావం: దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై; ఇది పుణ్యమని, అది పాపమని ఏ మాత్రం ఆలోచించక, నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగిపుంగవుడు ఈ లోకంలో బాలునిలాగ, పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.



కస్త్వం కోహం కుత ఆయాతః

కా మే జనని కో మే తాతః |

ఇతి పరభావయ సర్వమసారం

విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||23||


భావం: నీవెవరు? నేనెవరు? ఎక్కడ నుండి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? ఇదీ నువ్వు విచారణ చెయ్యవలసినది. ఈ ప్రపంచం సారహీనమైనది; కేవలం కలలో కనిపించు దృశ్యం లాంటిదే అని దీనిని విడిచిపెట్టు.



త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:

వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |

భవ సమచిత్తః  సర్వత్ర త్వం

వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24||



భావం: నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు.



శత్రౌ మిత్రే పుత్రే బంధవ్

మా కురు యత్నం విగ్రహ సంధవ్ |

సర్వస్మిన్నపి పశ్యాత్మానం

సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం ||25||


భావం: శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని,  బంధువు గాని - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు.




కామం క్రోధం లోభం మోహం

త్యక్త్వా త్మానం భావయ కోహం |

ఆత్మజ్ఞాన విహీనా మూడాః

తే పచ్యంతే నరకనిగూడః ||26||


భావం: కోరిక, కోపం, లోభం, భ్రాంతి - వీటన్నిటిని విడిచిపెట్టిన సాధకుడు "ఆ పరమాత్మను నేనే " అనే సత్యాన్ని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు. అట్టివారు ఈ సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి హింసించబడతారు.



గేయం గీతా నామ సహస్రం

ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |

నేయం సజ్జన సంగే చిత్తం

దేయం దీనజనాయ చ విత్తం ||27||


భావం: భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి.


సుఖతః క్రియతే రామాభోగః

పశ్చాద్ధంత శరీరే రోగః |

యద్యపి లోకే మరణం శరణం

తదపి న ముంచతి పాపాచరణం ||28||


భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే మానవుడు పాప కార్యములను వదలనే వదలడు.



అర్థమనర్థం భావయ నిత్యం

నాస్తితతః సుఖలేశః సత్యం |

పుత్రాదపి ధన భాజాం భీతి:

సర్వత్రైషా విహితా రీతి: ||29||


భావం: డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. ధనవంతునికి తన కుమారిని వల్ల కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే.



ప్రాణాయామం ప్రత్యాహారం

నిత్యానిత్య వివేకవిచారం |

జాప్యసమేత సమాధివిధానం

కుర్వవధానం మహదవధానం ||30||


భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం; విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం; నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం; జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు.



గురుచరణా౦బుజ నిర్భర భక్తః

సంసారాదచిరార్భవ ముక్తః |

సేంద్రియమానస నియమాదేవం

ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||31||


భావం: గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన ఓ భక్తుడా! నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకులతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు గాక!



మూఢః కశ్చన వైయాకరణో

డుకృన్కరణాధ్యయన ధురిణః .

శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై

బోధిత ఆసిచ్ఛోధితకరణః ॥32॥


భావం: వ్యాకరణ నియమాలతో తనను తాను కోల్పోయి మూఢుడైన వ్యాకరణకర్త, శంకర భగవత్పాదులవారి బోధనలతో కడిగివేయబడ్డాడు.



భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే

నామస్మరణాదన్యముపాయం

నహి పశ్యామో భవతరణే ॥33॥


భావం: భజించు గోవిందుని! భజించు గోవిందుని! ఓ మూఢుడా  గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు

|| ఇతి భజగోవిందం సంపూర్ణం ||

సేకరణ : Social Media
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media