ఓసాధువు ఒకసారి తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, 'ఈరోజు మీరిద్దరూ యాభైకోసుల దూరంవెళ్ళాలి' అన్నాడు.
ఒక శిష్యుడికి ఓసంచిలో తినుబండారాలు నింపి ఇచ్చి 'ఎవరైనా వీటి అవసరమున్నవారు దారిలో కనిపిస్తే వారికి పంచుకొంటూ వెళ్ళ'మన్నాడు.
రెండవ శిష్యుడికి ఖాళీసంచి ఇచ్చి 'దారిలో విలువైనవేవైనా కనిపిస్తే వాటిని సంచిలో వేసుకొంటూ వెళ్ళ'మన్నాడు.
ఇద్దరూ ఇచ్చిన సంచులను భుజాలకి తగిలించుకొని, ప్రయాణం మొదలుపెట్టారు, నెమ్మదిగా నడచుకొంటూ.
ఖాళీసంచివాడు ఆడుతూ పాడుతూ నడుస్తున్నాడు. కొంతదూరం వెళ్ళాక అతనికి ఒక బంగారురాయి దొరికింది. దాన్నితీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరంవెళ్ళాక మరొకటి కనిపించింది. దాన్నీ తీసి సంచిలో వేసుకున్నాడు.
అలా ఎక్కడెక్కడ బంగారురాయి కనిపిస్తే, దాన్ని తీసుకొని సంచిలో వేసుకొంటూ నడక సాగించాడు.
దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడంకూడ ఇబ్బందిగా మారింది. అడుగు తీసి అడుగేయడం చాలా కష్టమైపోయింది.
ఇక రెండో శిష్యుడు వెళ్తూవెళ్తూ ఉంటే, దారిలో ఆకలితో కనిపించినవారికి తన సంచిలోని తినుబండారాలను కొంచెంకొంచెంగా పంచుకొంటూ వెళ్ళాడు. క్రమక్రమంగా సంచి బరువు తగ్గసాగింది.
అతని నడక సులభం అయింది.
*ఎవరు పంచుకొంటూ వెళ్ళారో*, అతను తన గమ్యాన్ని చేరుకోవడం సులభమైంది.
*ఎవరు పోగేసుకొంటూ వెళ్ళారో*, అతను తన గమ్యాన్ని చేరుకోలేక పోయాడు.ఎన్నో కష్టాలు అనుభవించాడు.
_మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి... *ఏమి పంచారో, ఏమి పోగేసుకున్నారో* గమ్యాన్ని ఎలా చేరుకో దలచుకొన్నారో._
🙏
సేకరణ : Social Media